రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రశాంత వాతావరణానికి ఎటువంటి భంగం కలిగించకుండా ప్రవర్తించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పక పాటించి సహకారం అందించాలని కోరారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి అల్లర్లు సృష్టించి, గొడవలు ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న ఒంగోలులో వైసిపి టిడిపి ల పరస్పర ఘర్షణలో ఇరు వర్గాల వారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టడానికి ప్రత్యేకంగా దిశ డిఎస్పీ ని నియమించామని పేర్కొన్నారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో జరిగిన సంఘటనపై రిమ్స్ డ్యూటీ డాక్టరు ఇచ్చిన కంప్లైంట్ మేరకు చీమకుర్తి సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.