వైసిపి అధికారంలోకి వచ్చాక వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గద్దెనెక్కిన జగన్ ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రశ్నించారు..మీ అవసరాల కోసం వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి రెండు లక్షల ఉద్యోగాలు నింపామని చెప్పుకోవడం తప్పా…గౌరవంగా చెప్పుకొనే ఒక్క ఉద్యోగం అయినా భర్తీ చేశారా అని గురువారం ఎక్స్ వేదికగా నిలదీశారు..ఏటా జాబ్ క్యాలెండర్, జంబో డీఎస్సీ, ఏపిపీఎస్సీ నుంచి వరుస నోటిఫికేషన్లని నమ్మించి నిరుద్యోగులను నిండా ముంచిన జగన్ మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అని ధ్వజమెత్తారు. జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు చేసిన మోసం చాలదని…జాబు రావాలంటే జగన్ రావాలని ఘరానా మోసానికి జగన్మోహన్ రెడ్డి తెరలేపారనీ పేర్కొన్నారు. రాష్ట్రంలో నేటికీ వివిధ శాఖల పరిధిలో 2.25లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే జగన్ మార్క్ పాలనకు నిదర్శనం అని ఎద్దేవా చేశారు.