Prakasam Ysrcp: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ ప్రక్షాళనకు గడువు మరో రెండు మూడు నెలలు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే రెండున్నరేళ్లకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. దీంతో మరో రెండు మూడు నెలల్లో ఆ ఘడియలు రాబోతున్నాయి. కొంత మంది మంత్రులపై అవినితి ఆరోపణలు రావడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివాదాల్లో చిక్కుకోవడం, పని తీరు సక్రమంగా లేకపోవడం, శాఖపై పట్టు సాధించకపోవడం ఇలా అనేక కారణాలతో ఉన్నారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు తప్పనిసరి అని భావిస్తున్నారు. అయితే ఎవరిని మంత్రివర్గంలో ఉంచుతారు. కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారు అనే విషయాలపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహగానాలు వస్తున్నా ఒక్కో జిల్లాలో పరిస్థితి ఒక్కో విధంగా ఉంది. మంత్రి పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఓ జిల్లాలో అయితే ఒక మంత్రి పదవికి నలుగురు పోటీ పడుతున్నారు. ఓ జిల్లాలో తనకు మంత్రి పదవి తీసివేసినా ఫరవాలేదు కానీ పార్టీలోనే తనకు ప్రత్యర్థిగా ఉన్న ఎమ్మెల్యేకి మాత్రం మంత్రి పదవి ఇవ్వవద్దంటూ కండిషన్ లు పెడుతున్నారుట. తనకు మంత్రి పదవి అవకాశం కల్పించాలని కోరుతుండగా మరోక ఎమ్మెల్యే తాను పార్టీలో సీనియర్ నాయకుడిని, గతంలోనూ మంత్రిగా పని చేశాను తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఒకాయన అడుగుతున్నారు. తాను రాష్ట్ర్లంలో జగన్మోహనరెడ్డి తరువాత అత్యధిక మెజార్టీ 80వేల ఓట్లతో గెలుపొందాను, కావున తనకు కశ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలంటూ మరో నేత అడుగుతున్నారుట. ఇలా నలుగురు ఎమ్మెల్యేల మధ్య ఒక మంత్రి పదవి దోబూచులాడుతోంది. ఆ జిల్లా ఏమిటనేది చెప్పుకోవాలంటే ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒక సారి పరిశీలించాలి.
ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు బాలినేని శ్రీనివాసరెడ్డి కాగా మరొకరు ఆదిమూలపు సురేష్. వీరు ఇద్దరు మంత్రివర్గంలో ఉంటారా ఉండరా అంటే డౌటే. బాలినేని శ్రీనివాసరెడ్డి పదవికి ఏమాత్రం ఢోకాలేదని చెప్పుకోవచ్చు. ఆయన జగన్మోహనరెడ్డికి స్వయానా బంధువు కావడంతో పాటు రెడ్డి సామాజిక వర్గంలో గట్టి నాయకుడు. జిల్లాలోనూ పట్టు ఉన్న నాయకుడు. ఈ కారణాల వల్ల ఆయన మంత్రి పదవికి ఏ మాత్రం ఢోకాలేదని సమాచారం. కానీ రెడ్డి సామాజికవర్గంలోనే చాలా మంది మంత్రి పదవికి పోటీ పడుతుండటం ఒక మైనస్ గా కనబడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రెడ్డి సామాజికవర్గంలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆనంత వెంకట్రామిరెడ్డి మొదలుకుని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇలా దాదాపు 15 మంది రెడ్డి సామాజికవర్గంలోనే మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఇప్పుడు నలుగురు బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిలు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి ఎవరికైనా అవకాశం కల్పించాలంటే ఈ నలుగురిలో ఎవరినైనా తీసివేయాలా లేదా అన్నది సున్నితమైన అంశంగా మారింది. అదే విధంగా ఆదిమూలపు సురేష్ విషయంలోనూ ఎస్సీ సామాజికవర్గంలో గట్టిపోటీనే నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఎస్సీ ఓటు బ్యాంకు ఎక్కువ ఉంది కాబట్టి అత్యధిక రిజర్వుడు స్థానాలు వైసీపీ కైవశం చేసుకుంది. దీంతో అదే సామాజికవర్గంలో మరో నేతకు మంత్రి వర్గంలో స్థానం కల్పించి ఆదిమూలపు సురేష్ కు ప్రత్యామ్నాయంగా కేబినెట్ స్థాయి పదవి ఏదైనా ఇవ్వవచ్చనే టాక్ వినబడుతోంది.
Prakasam Ysrcp: రెడ్డి సామాజికవర్గంలో గట్టి పోటీ
బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో మాత్రం గట్టి పోటీ నెలకొంది. ఇదే జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీదర్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే, నాల్గవ సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతే కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగానూ పని చేశారు. జిల్లాలో మంచి పట్టు ఉన్న నాయకుడు కూడా. ఈయన మంత్రిపదవిని ఆశిస్తున్నారు. అయితే జిల్లాలో ఇద్దరు సీనియర్ లు కావడంతో మంత్రి బాలినేనికి మహీదర్ రెడ్డికి మధ్య రాజకీయంగా గ్యాప్ నడుస్తోంది. ఇప్పుడు బాలినేనికి మంత్రి పదవి తీసేసి మహీదర్ రెడ్డికి ఇస్తే సున్నితమైన వివాదానికి దారి తీసినట్లు అవుతుంది. ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా మంత్రిపదవిని ఆశిస్తున్నారు. ఆయన ఆర్యవైశ్య సామాజికవర్గంలో కీలకమైన నాయకుడు. అంతే కాకుండా జగన్మోహనరెడ్డి తరువాత అత్యధిక మెజార్టీతో గెలిచిన నాయకుడు ఆయనే. దాదాపు 81వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రస్తుత జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో ఆర్యవైశ్య సామాజికవర్గం నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అయన అనేక వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను తప్పించి అన్నా రాంబాబుకు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక నాల్గవ వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి రెండవ సారి టీటీడీ చైర్మన్ పదవికి ఇష్టపడలేదు. ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టాలని భావించారు. కానీ ఆయనను జగన్ ఒప్పించి మరో సారి టీటీడీ అప్పగించేశారు. దీంతో ఆయన పోటీ లేనట్లే. కానీ బాలినేని, మహీదర్ రెడ్డిలలో ఒకరికి, అన్నా రాంబాబుకు మంత్రి పదవి ఇస్తే రెండు మంత్రి పదవులు ఒసిలకు ఇచ్చినట్లు అవుతుంది. ఇది ఒక సున్నితమైన అంశం. ఈ సామాజిక సమీకరణల నేపథ్యంలో సీఎం జగన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుని ఎవరికి అవకాశం కల్పిస్తారు అనేదానిపై జిల్లాలో ఆశక్తికరమైన చర్చ జరుగుతోంది.