Nara Lokesh: నాడు నేడు దోపిడీ కార్యక్రమం అని వైసీపీ నేతలే కుండబద్దలు కొడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నవరత్న పథకాల్లో భాగమైన నాడు – నేడు కార్యక్రమంలో జరుగుతున్న అక్రమాల గుట్టును మండల పరిషత్ పాఠశాల విద్యాకమిటి చైర్మన్ బద్దెగం సుబ్బారెడ్డి రట్టు చేశారని అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని ఓ పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేతే స్వయంగా నాడు నేడులో ముఖ్యమంత్రి అనుకున్నట్లుగా పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తూ చేసిన సెల్ఫీ వీడియోను లోకేష్ పోస్టు చేశారు.
నాడు – నేడులో తాను పాఠశాల అభివృద్ధి పనులు చేస్తే తనకు బిల్లు మొత్తం చెల్లించలేదనీ, ఈ విషయంపై పాఠశాల అధికారుల నుండి సరైన రెస్పాన్స్ లేకపోతే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ నెల 22వ తేదీ విద్యాకమిటీ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తన బిల్లులు చెల్లింపులు జరిగే వరకూ కమిటీ చైర్మన్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సుబ్బారెడ్డి సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. నాడు – నేడు పనులపై విచారణ జరిపించాలని సుబ్బారెడ్డి కోరారు. ఈ వీడియోను లోకేష్ పోస్టు చేస్తూ..ఇక జగన్ రెడ్డి గారి దొంగ మీడియా చనిపోయింది ప్రైవేటు విద్యార్థి అయితే లోకేష్ కు నష్టం ఏమిటి అంటూ చెత్త రాతలు రాశారని విమర్శించారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ నియోజకవర్గం యర్రగొండపాలెం మండలం గుర్రపుశాల మండల పరిషత్ పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ బద్దెగం సుబ్బారెడ్డి నాడు నేడు పేరుతో జరుగుతున్న అక్రమాలు మొత్తం బయటపెట్టారని అన్నారు. ఇదో దోపిడీ కార్యక్రమం అని సొంత పార్టీ వాళ్లే కుండబద్దలు కొడుతున్నారని విమర్శించారు. దీనిపై విచారణ జరిపితే పిల్లల పేరుతో వైకాపా పందికొక్కులు తిన్న కోట్ల లెక్కలు బయటపడతాయని లోకేష్ ట్వీట్ చేశారు.
https://twitter.com/naralokesh/status/1437327740886126598