అనంతపురం జిల్లా టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. రైతుల కోసం తెలుగుదేశం పేరుతో సునీత పాదయాత్ర చేస్తున్నారు. రామగిరి మండలం గరిమేకలపల్లి నుండి పేరూరు వరకూ తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు 18 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో పరిటాల శ్రీరాంతో పాటు పెద్ద సంఖ్య టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించాలని, ఇన్సూరెన్స్ చెల్లించాలని ఇలా రైతు సమస్యలపై ఆమె డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టపరిహారం కూడా పూర్తి స్థాయిలో అందడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరిస్తే తాము పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమి ఉందని అన్నారు.
ఇంతకు ముందు కనగాలపల్లిలో పాదయాత్ర నిర్వహించి రైతుల సమస్యలు తెలుసుకున్నాననీ, ఇది తన రెండవ పాదయాత్ర అని చెప్పారు పరిటాల సునీత. ఈ ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గరిమేకలపల్లి పంచాయతీలో 2200 మంది రైతులు ఉంటే కేవలం 1400 మందికి మాత్రమే పంట నష్టపరిహారం ఇచ్చారనీ తెలిపారు. వైసీపీకి చెందిన రైతులు కూడా పాదయాత్రలో వారి సమస్యలను విన్నవిస్తున్నారని చెప్పారు. తను పాదయాత్ర నిర్వహణకు పోలీసుల అధికారుల అనుమతి కోరుతూ లేఖ అందజేయడం జరిగిందన్నారు. గతంలో తాను నిర్వహించిన పాదయాత్ర సమయంలోనూ ఎటువంటి ఇబ్బందులు, గొడవలు జరగలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామాల్లో రైతులతో ముచ్చటిస్తూ పాదయాత్రను సునీత కొనసాగిస్తున్నారు.