జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సాగర తీరంలో విహరించడంతో పాటు రుషికొండ ప్రాంతాన్ని పర్యటించారు. రుషికొండ తవ్వకాలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ రుషికొండ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న నిర్మాణాల వీడియోను జనసేన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్ పై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం, ముందస్తు అనుమతి లేకుండా అక్కడకు వెళ్లడం వంటి వాటిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల ఇప్పటం గ్రామ సందర్శనకు పవన్ కళ్యాణ్ కన్వాయ్ పై ఎక్కి కూర్చుని వెళ్లడంపైనా కేసు నమోదు అయ్యింది. కారుపై కూర్చుని వెళ్లడం, ర్యాష్ డ్రైవింగ్ పై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ కళ్యాణ్, ఆయన కారు డ్రైవర్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజా ఘటనతో మరో కేసు నమోదు అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
విషయంలోకి వెళితే.. విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కొద్ది సేపు సాగర తీరంలో సరదాగా గడిపారు. రుషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోడీతో శుక్రవారం రాత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తర్వాత తను బసచేసిన నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. ఈ ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ హోటల్ లోనే ఉన్నారు. పలువురు ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు. సాయంత్రం పార్టీ నేతలతో కలిసి కాపులప్పాడు బీచ్ ను సందర్శించారు. కొద్దిసేపు సాగర తీరంలో సరదాగా గడిపారు. అక్కడ స్థానిక మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం రుషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు. రుషికొండ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది. ఇంతకు ముందు పలువురు నేతలు రుషికొండ ప్రాంతానికి వెళితే పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆయన వెంట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, విశాఖ కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ తదితరులు ఉన్నారు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు జనసేన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.