రాబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో టీడీపీ – జనసేన పొత్తులు దాదాపు ఖరారు అయినట్లే. ఈ నేపథ్యంలో జనసేన ఏయే స్థానాలు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బలమైన స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడంతో పాటు ప్రతి జిల్లాలోనూ ఒకటి రెండు స్థానాల్లో జనసేన అభ్యర్ధులు ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. జనసేనలో నెంబర్ 2 గా ఉన్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మూడు రోజుల క్రితం ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటించి వెళ్లారని కూడా అంటున్నారు.
ఈ రెండు నియోజకవర్గాల్లో మృతి చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున ఆర్ధిక సాయం అందించేందుకు నాదెండ్ల మనోహర్ స్వయంగా వచ్చారు. ఈ సందర్భంలోనే దర్శి, చీరాల నియోజకవర్గాల్లో జనసేన నేతలతో పార్టీ బలాబలాలపై చర్చించారుట. ఒక వేళ జనసేన పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్నదానిపై అంతర్గతంగా చర్చించారని అంటున్నారు. 2009 లో దర్శిలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి మద్దిశెట్టి వేణుగోపాల్ కు 27 (17.61శాతం) వేలకుపైగా ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్ధి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి 13వేల మెజార్టీతో గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ అభ్యర్ధి బోతుకు రమేష్ బాబుకు కేవలం నాలుగు వేల లోపు ఓట్లే వచ్చాయి. ఇక చీరాల విషయానికి వస్తే 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్ధి పాలేటి రామారావుకు 21వేలు (16.56శాతం) కు పైగా ఓట్లు వచ్చాయి. 11వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ గెలిచారు. ఇవన్నీ పరిశీలించడంతో పాటు ప్రస్తుతం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తొంది. ఈ మంతనాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ పాల్గొన్నట్లు సమాచారం.
చీరాల నియోజకవర్గంలోని టీడీపీ ఇన్ చార్జి పట్ల చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా దర్శి నియోజకవర్గంలో టీడీపీకి నాయకత్వ సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు నియోజకవర్గాలను జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నందున ఆ పార్టీ నేతలు వీటిపై దృష్టి సారించి నాయకత్వం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తొంది.