ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన పూర్తి అయి నాలుగేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులతో సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు జగన్ పాలనపై విశ్లేషణ చేస్తూ పేదల గుండెలకు చేరువైన తొలి సీఎం జగన్ అని కొనియాడారు. జనరంజక పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ మరో పాతికేళ్లు సీఎంగా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు శిద్దా.
ఈ సందర్భంగా ఆయన పేర్కొన్న కొన్ని కీలక అంశాలు..
“జగన్మోహనరెడ్డి అధికారంలోకి రావడంతోనే పలు వ్యవస్థల మార్పునకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్న పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు అందేందుకు గానూ గ్రామ సచివాలయాల పరిధిలో 50 నుండి 75 ఇళ్లకు వాలంటీర్లను నియమించారు. వాలంటీర్ల వ్యవస్థతో లబ్దిదారుల చెంతకే పథకాలు అందుతున్నాయి. ఓ పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం జగన్.
సంస్కరణాభిలాషి సీఎం జగన్
నాడు – నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించారు. మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రాధమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియం విద్యాబోధన కు చర్యలు చేపట్టారు. ఈ అంశంలో తొలుత న్యాయపరమైన చిక్కులు వచ్చి సుప్రీం కోర్టు స్థాయి వరకూ వెళ్లినా ప్రభుత్వం అనుకున్న విధంగా కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యా బోధన అమలు చేస్తున్నారు. విద్యా, వైద్య రంగాల్లో తీసుకువచ్చిన సంస్కరణలు సత్పలితాలు ఇస్తున్నాయి. మరో పక్క ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపర్చారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను విస్తరించారు. 108, 104 సేవలను విస్తృతంగా అందించేందుకు నూతన వాహనాలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. అంతే కాకుండా నూతనంగా ఫ్యామలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసుకువచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది తిరగక ముందే విజృంభించిన కరోనా మహామ్మారి ప్రభావం రాష్ట్రంపైనా పడింది. లాక్ డౌన్ తో లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఈ సందర్భంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. ఇవన్నీ సీఎంను పేదలకు మరింత దగ్గర చేశాయని శిద్దా అన్నారు.
ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా ఆగని సంక్షేమం..!
“ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో అనేక ఆటు పోట్లు ఎదురైయ్యాయి. అయినా సంక్షేమ పథకాలు అమలులో జగన్ ఎక్కడా రాజీ పడలేదు. రాష్ట్ర అర్ధిక పరిస్థితి సహకరించకపోయినా వివిధ రూపాల్లో అప్పులు తీసుకువచ్చి మరీ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందిస్తూ వచ్చారు సీఎం జగన్. అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న వసతి దీవెన, లా నేస్తం, కాపు నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, జగనన్న విద్యా దీవెన వంటి పథకాలకు క్యాలెండర్ ప్రకారం బటన్ నొక్కి నిధులను లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తూనే ఉన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 98.5 శాతం హామీలు నెరవేర్చామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది. పాలనా వికేంద్రీకరణకు పెద్ద పీట వేసింది. మూడు రాజధానుల ఏర్పాటునకు ప్రభుత్వం సంకల్పించింది. కానీ న్యాయపరమైన చిక్కుల కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. జిల్లాల పునర్విభజన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలోని 13 జిల్లాలలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. మరో పక్క రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. వచ్చే విద్యా సంవత్సరం నుండి అయిదు మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటోంది. బ్లూ ఎకానమీకి సీఎం జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగు పోర్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాజధాని ప్రాంతంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని దాదాపు 50వేలకు పైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మొత్తానికి జగన్మోహనరెడ్డి ఈ నాలుగేళ్ల పాలనను పేదల సంక్షేమ పాలన అని చెప్పవచ్చు ” అని శిద్దా తన అభిప్రాయాలను వెల్లడించారు.