AP Privilege committee: ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హజరైన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పీకర్పై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన నేపథ్యంలో అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ మంగళవారం చైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు పై వచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. కమిటీ ముందు హజరైన అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలు స్పీకర్ కు బాధకల్గించినట్లైయితే విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాడు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. కాగా ప్రివిలేజ్ కమిటీ విచారణకు అచ్చెన్నాయుడు న్యాయవాదితో కలిసి వచ్చారు. కమిటీ న్యాయవాదిని అనుమతించకపోవడంతో ఆయన ఒక్కరే కమిటీ ముందు హజరై వివరణ తెలిపారు.
ప్రివిలేజ్ కమిటీ సమావేశం అనంతరం చైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారనీ, ఆయన వివరణను కమిటీ సభ్యులకు పంపిస్తామనీ తెలిపారు. కమిటీ సభ్యుల అభిప్రాయం తీసుకున్న తరువాత నిర్ణయం వెల్లడిస్తామన్నారు. కాగా మరో టీడీపీ నేత కూన రవి కుమార్ అందుబాటులో లేనని సమాచారం ఇచ్చారన్నారు. మరొక అవకాశం ఇస్తే కమిటీ ముందు హజరు అవుతానని తెలిపారని చైర్మన్ కాకాణి చెప్పారు. అదే విధంగా రిటైర్డ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎమ్మెల్యే రామానాయుడులపై వచ్చిన ఫిర్యాదులపై 21న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాకాణి వెల్లడించారు.