Perni Nani: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో నిన్న చిరంజీవి సహా పలువురు సినీ సెలబ్రిటీలు భేటీ అయిన సంగతి తెలిసిందే. సినీ రంగ సమస్యలపై సీఎం జగన్ తో చర్చించారు. సీఎం జగన్ తో జరిగిన సమావేశంలో చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని కృష్ణమురళి, ఆలీ, ఆర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి నాయకత్వంలో వీరంతా సీఎం జగన్ తో భేటీ అయి సినీమా టికెట్ల అంశంతో పాటు ఏపిలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు. ఈ సమావేశంతో ఇప్పటి వరకూ జరుగుతున్న వివాదానికి శుభం కార్డు పడినట్లు అయ్యింది. ఈ క్రమంలోనే తెలుగు సినీ పరిశ్రమను ఏపికి తీసుకువచ్చే అంశంపై సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. పలు హామీలు ఇచ్చారు.
విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. సినీ వర్గాలకు ఇళ్ల స్థలాలు, స్టూడియోలకు భూములను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ మాదిరిగా విశాఖలో ఓ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామన్నారు. ఏపిలోనూ షూటింగ్ లు పెట్టుకోవాలని సూచించారు. సినీ పరిశ్రమకు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కవ ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. టికెట్ల ధరల విషయంలో కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ సమావేశానికి సినీ పరిశ్రమలో పెద్ద దిక్కుగా ఉన్న మంచు మోహన్ బాబు, మా అధ్యక్షుడుగా ఉన్న మంచు విష్ణుకు అహ్వానం లేకపోవడం, వారు రాకపోవడంతో సినీ, రాజకీయ వర్గాల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మోహన్ బాబు, జగన్ కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. గత ఎన్నికల ముందు మోహన్ బాబు వైసీపీలో చేరారు. వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత మంచు విష్ణు కలిశారు గానీ మోహన్ బాబు కలవలేకపోయారు. నిన్న జరిగిన సమావేశంలో మోహన్ బాబుకు ప్రాధాన్యత లేకపోవడంతో జగన్ పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇది సినీ వర్గాల్లోనూ రచ్చకు దారి తీస్తోంది.
ఈ తరుణంలో ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం మోహన్ బాబు నివాసానికి వెళ్లి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బొత్సా సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకకు హైదరాబాద్ వెళ్లిన మంత్రి పేర్ని నాని మోహన్ బాబు నివాసానికి వెళ్లి కలిశారు. నిన్న జరిగిన సమావేశంలో చర్చల వివరాలను మోహన్ బాబుకు మంత్రి నాని వివరించారు. సీఎం జగన్ సూచనల మేరకే మంత్రి నాని మోహన్ బాబు నివాసానికి వెళ్లి కలిశారని సమాచారం. దీంతో మోహన్ బాబును ఏపి ప్రభుత్వం, జగన్ దూరం పెట్టారు అన్న వార్తలు నిజం కాదని తెలిసిపోయింది.