Kodali Nani: ఏపి మంత్రి కొడాలి నాని సెన్షేషనల్ ప్రకటన చేశారు. టీడీపీ అనుకూల మీడియా, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈటీవీ, ఈనాడు, టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియాలను వైసీపీ బహిష్కరిస్తోందని పేర్కొన్నారు. మంత్రులు, వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, మాట్లాడటం చేయవద్దని ఆదేశించారు. ప్రజలను తప్పుదోవపట్టించేలా చంద్రబాబు కుల మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుందని చెప్పారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ ప్రజల సొమ్మును లూటీ చేశారని మంత్రి కొడాలి ఆరోపించారు. వైఎస్ జగన్ పాలన రాష్ట్రంలో 30 ఏళ్ల ఉంటుందని మంత్రి కొడాలి పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడే సీఎం వైఎస్ జగన్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటూ విరుచుకుపడ్డారు. తమిళనాడులో ప్రతిపక్షాలను చూసి అయినా చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలని కొడాలి హితవు పలికారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాష్ట్రం వదిలిపోతానంటూ సవాల్ చేశారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు తానే నిర్మించాననీ చంద్రబాబు రుజువు చేయగలరా అని సవాల్ విసిరారు. ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించినట్లుగా చంద్రబాబు రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని కొడాలి పేర్కొన్నారు.
వైఎస్ హయాంలో ఆ రెండు పత్రికలు అంటూ విమర్శించగా, వైసీపీ చాలా కాలంగా ఎల్లో మీడియా అంటూ విమర్శలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆ మీడియాలపై కీలక ప్రకటన చేసింది వైసీపీ. మీడియా సమావేశాలకు ఆ ఛానల్స్, పత్రిక ప్రతినిధులను పిలవవద్దనీ, వారితో మాట్లాడవద్దని ఆదేశిస్తున్నట్లు కొడాలి నాని పేర్కొనడం విశేషం.