CM Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై జగన్ సమావేశం నిర్వహించిన 24 గంటల వ్యవధిలోనే పీఆర్సీ సమస్యకు పరిష్కరించారు. ముందుగానే ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి వివరించిన జగన్.. ఉద్యోగులు సహకరించాలని కోరారు. నిన్న ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలపై నేడు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. అనంతరం మరో మారు ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి మాట్లాడిన జగన్ పీఆర్సీపై ప్రకటన చేశారు. 23 శాతం ఫిట్ మెంట్ ప్రకటించడంతో పాటు రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంపు చేస్తున్నట్లు ప్రకటించారు.
జనవరి 1 నుండి పెంచిన కొత్త జీతాలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. దీంతో ప్రభుత్వానికి 10,247 కోట్ల అదనపు భారం పడనుంది. పీఆర్సీ 2028 జూలై 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. మానిటరీ బెనిఫిట్ 2020 ఏప్రిల్ 1 నుండి అమలుకు నిర్ణయాన్ని తెలిపారు. ఈ జనవరి నుండి పెంచిన కొత్త వేతనాలు అమలు కానున్నాయి. సీపీఎస్ పై జూన్ 30లోగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్ రిక్లేర్ చేసే ప్రక్రియను పూర్తి చేసి సవరించిన రెగ్యులర్ జీతాలను ఈ ఏడాది జూలై జీతం నుండి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా సొంతిల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ఎంఐజీ లే అవుట్స్ లోని ప్లాట్లలో పది శాతం రిజర్వ్ చేయడమే కాకుండా 20 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.