ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల విశాఖ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. శుక్రవారం రాత్రి విశాఖకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఈ రోజు విశాఖలో రూ.10,742 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుండి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రధాని మోడీ ప్రాజెక్టులను ప్రారంభించారు. మోడీ బహిరంగ సభ విజయంతం కోసం ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల నుండి భారీగా జన సమీకరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో వైసీపీ నేతలు జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు. ముందుగా సీఎం జగన్మోహనరెడ్డి తన ప్రసంగంలో తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. గతంలో పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేసిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి వాటిని పరిష్కరించాలని ప్రధాని మోడీని కోరారు. అయితే పీఎం మోడీ మాత్రం తన ప్రసంగంలో వీటి గురించి ఏ హామీ ఇవ్వలేదు.
ప్రియమైన సోదరీ సోదరమణులకు స్వాగతం అంటూ ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనే అదృష్టం కలిగిందన్నారు. ఈ రోజు విశాఖపట్నం ప్రారంభించే రూ.10వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతో విశాఖ, ఏపి ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజక్టులతో ఏపి అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుందని చెప్పారు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏపికి ప్రజలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కేవలం సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన గుర్తింపు మాత్రమే కాకుండా తెలుగు ప్రజలకు స్నేహ శీలత, సహద్బావం వల్లే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారన్నారు. తెలుగు ప్రజలు ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తపన పడతారని అన్నారు.
మౌలిక వసతుల అభివృద్ధి అన్ని రంగాల పురోగతిని వేగవంతం చేస్తొందని పీఎం మోడీ అన్నారు. ఒక వైపు విశాఖ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరుస్తూనే మరో వైపు ఫిషింగ్ హార్బర్ ను అధునీకరిస్తున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనతోనే ఏపి తీర ప్రాంతం వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశమే అందరికీ ఆశావహ దృక్పదం ఇస్తొందన్నారు. తమ ప్రతి నిర్ణయం సామాన్యుడి జీవితాన్ని మెరుగుపర్చడం కోసమేనని చెప్పారు. ఒక వైపు తాము చేస్తున్న అభివృద్ధి తో దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని వివరించారు. మరో వైపు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తున్నామని అన్నారు. రైతులకు ఏటా రూ.6వేల ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామనీ, ఉచితంగా బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ప్రధాని మోడీకి సీఎం జగన్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. విశాఖలో కార్యక్రమం అనంతరం విమానాశ్రయానికి బయలుదేరిన మోడీ అక్కడ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పయనమయ్యారు.