Hyderabad Drugs Case: హైదరాబాద్ రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ పై ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి డ్రగ్స్ కనుగొన్న విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీల కుమార్తెలు, కుమారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఈ కేసు రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి కీలక సమాచారాన్ని రాబట్టారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన సమయంలో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలను వెల్లడించారు.
ఈ పబ్ లో మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్టు పక్కా సమాచారంతో 3వ తేదీ తెల్లవారుజామున ఆకస్మికంగా దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్ కస్టమర్ లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పబ్ లోకి ప్రవేశించాలంటే పామ్ అనే యాప్లో కస్టమర్లు ముందుగా 50వేలు చెల్లించి రిజిస్టర్ అయి ఉండాలట. టాస్క్ ఫోర్స్ దాడిలో అక్కడ అనుమానాస్పదంగా లభించిన ప్యాకెట్లను పరీక్షించగా అది కొకైన్ అని తేలింది. 4.6 గ్రాముల కొకైన్ ఉన్నట్టుగా గుర్తించారు. పబ్ లో ఉన్న ల్యాప్ టాప్, ప్రింటర్, వేయింగ్ మిషన్తో పాటు ప్యాకింగ్ మెటీరియల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్లను విచారించగా పబ్లో కిరణ్రాజు, అర్జున్ వీరమాచినేని కూడా భాగస్వాములుగా ఉన్నట్టు తెలుసుకుని వారిపైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు ఇద్దరు పరారీలో ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ కు సంబందించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వారిని కస్టడీకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.