కడప ఎంపీగా రాజన్న బిడ్డ కావాలా? హత్యలు చేసే అవినాష్ రెడ్డి కావాలా? ఒక వైపు న్యాయం ఉంది. మరో వైపు అధికారం ఉంది.ఒక వైపు ధర్మం ఉంది. మరో వైపు ధనం ఉంది. జిల్లా ప్రజలే న్యాయ నిర్ణేతలని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు. శుక్రవారం వైయస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి లో జరిగిన బస్సు యాత్ర లో ఆమె మాట్లాడుతూ …రాముడు కి లక్షణుడు ఎలానో రాజశేఖర్ రెడ్డికి వివేకానంద రెడ్డి అలా. ఏ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి మాటను జవదాటని వ్యక్తి వివేకానంద రెడ్డి అని పేర్కొన్నారు.వివేకానంద రెడ్డి ప్రజల మనిషి….అలాంటి వ్యక్తిని ఘోరంగా నరికి హత్య చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో హంతకులను కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి.వైసిపి పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డిని ఓడించాలి.రాజశేఖర్ రెడ్డి బిడ్డను గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే రాజశేఖర్ రెడ్డి , వివేకానంద రెడ్డి ల వలే ఈ ప్రాంతానికి సేవ చేస్తానని పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు అయ్యింది. హత్య చేసిన వారికి చేయించిన వారికి శిక్ష పడిందా? వివేక కుటుంబానికి న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. ఐదేళ్లుగా హంతకులు దర్జాగా బయట తిరుగుతుంటే… న్యాయం కోసం వివేక రక్తం ఘోసిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేయించింది కడప ఎంపీ అవినాష్ రెడ్డి అని సీబీఐ పేర్కొంది. గూగుల్ టెకౌట్, కాల్ డేటా వివరాలు ఇతర ఆధారాలు అన్ని ఉన్నాయి.కానీ తన చిన్నాన్న ను హత్య చేసిన వారికే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టిక్కెట్ ఇచ్చారు. అందుకే కడప ఎంపీ గా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు.