Home వార్తలు పాలిసెట్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి : నాగరాణి

పాలిసెట్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి : నాగరాణి

రాష్ట్రంలో పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష కోసం విధ్యార్ధులకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి కోరారు. పాలిటెక్నిక్ ప్రవేశాల పెంపు లక్ష్యంగా విద్యార్ధులకు ఇస్తున్న సమగ్ర శిక్షణకు మంచి స్పందన లభిస్తుందన్నారు. బుధవారం విజయవాడ, గుంటూరులోని ఎంబిటిఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ తో సహా, పలు ఎంట్రన్స్ కోచింగ్ కేంద్రాలను నాగరాణి సందర్శించి విధ్యార్ధులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేసారు. పాలిటెక్నిక్ ప్రవేశాలను కోరుకునే ప్రతి ఒక్కరికీ వయోబేధం లేకుండా శిక్షణ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 87 ప్రభుత్వ, 182 ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లలో ఏప్రిల్ 24 వరకు తరగతులు నిర్వహించి ఏప్రిల్ 25వ తేదీన గ్రాండ్ ఫ్రీ ఫైనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను సైతం నిర్వహిస్తామని వివరించారు.

తెలుగు, ఇంగ్లీషు మాధ్యమ విధ్యార్దులకు ఉపకరించేలా రెండు భాషలలోనూ స్టడీ మెటీరియల్ సిద్దం చేసామన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈ శిక్షణకు మంచి డిమాండ్ ఉందని, విద్యార్దులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు ఎనిమిదవ తేదీ నుండి మరో బ్యాచ్ ప్రారంభించేందుకు సాంకేతిక విద్యా శాఖ సన్నాహాలు చేస్తుందన్నారు. పాలిసెట్ కోచింగ్ స్టడీ మెటీరియల్‌ను ప్రతి ఒక్క విద్యార్దికి అందిస్తామని, రెండు గంటల పాటు గణితం, ఒక గంట భౌతిక శాస్త్రం, మరో గంట రసాయన శాస్త్రం బోధిస్తారన్నారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఏప్రిల్ 27వ తేదీన కాగా, ఆన్‌లైన్ అప్లికేషన్‌లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందని నాగరాణి స్పష్టం చేసారు. కార్యక్రమంలో విధ్యార్ధులతో పాటు తల్లిదండ్రులు పాల్గొని, పాలిటెక్నిక్ తరువాత లభించే ఉపాధి అవకాశాల గురించి స్వయంగా కమిషనర్ తో వ్యక్తిగతంగా మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శి రమణబాబు, సంయిక్త కార్యదర్శి జానకిరామ్, ఉప కార్యదర్శి రవికుమార్, కళాశాల ఫ్రిన్సిపల్ శేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Exit mobile version