CM YS Jagan: ఏపి సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎజెండాలోని పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు. అన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాల ఆర్డినెన్స్ , సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అదే విధంగా నవంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరుగనుంది. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామక అంశంపైనా చర్చ, చట్ట సవరణ పై చర్చించనున్నారు. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.
CM YS Jagan: మధ్యాహ్నం గవర్నర్ తో సీఎం జగన్ భేటీ
కాగా సీఎం జగన్ కేబినెట్ భేటీ అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. టీడీపీ కార్యాలయం సహా నేతలపై వైసీపీ శ్రేణుల దాడులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మొన్న ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందనీ, 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తో సమావేశం అవుతున్న సీఎం వైఎస్ జగన్ టీడీపీ కార్యాలయంపై దాడుల అంశంపై వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాడులకు దారి తీసిన పరిస్థితులను సీఎం జగన్ వివరించనున్నట్లు సమాచారం. దాడులకు ముందు టీడీపీ నేతలు తనను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి సీడీలు, ఇతర అధారాలను గవర్నర్ కు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా నవంబర్ నెలలో నిర్వహించాలని భావిస్తున్న శాసనసభ సమావేశాలపైనా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.