TDP: ఏపిలో ఇటీవల టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడి చేసిన నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు అయి ఉండటంతో చంద్రబాబు టీమ్ ఆయనను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించి వినతి పత్రాన్ని సమర్పించారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు బృందం ప్రయత్నించగా వారి అపాయింట్మెంట్ లు ఖరారు కాకపోవడంతో మంగళవారం సాయంత్రం వెనుతిరిగి వచ్చేశారు. అమిత్ షా అపాయింట్మెంట్ లభించకపోవడంతో టీడీపీ శ్రేణులు నిరుత్సాహపడ్డారు. ఇదే సందర్భంగా వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. గతంలో ఏపికి వచ్చిన సమయంలో అమిత్ షా కాన్వాయ్ పై టీడీపీ శ్రేణులు చెప్పులతో దాడి చేసి నిరసన వ్యక్తం చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అపాయింట్మెంట్ అడిగారని ప్రశ్నిస్తూ ఆ విషయాలను గుర్తు పెట్టుకునే అపాయింట్మెంట్ ఇవ్వలేదేమో అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఊరట కల్గించేలా బుధవారం మద్యాహ్నం చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేశారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల తాను కలవలేకపోయాననీ, త్వరలో కలుద్దామని చంద్రబాబుకు షా తెలిపినట్లు సమాచారం. తనను ఎందుకు కలవాలనుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపిలో పరిస్థితులపై నివేదికను తయారు చేశామనీ, దాన్ని పంపుతామని అమిత్ షాకు చంద్రబాబు చెప్పారు. టీడీపీ ఆఫీసుపై వైసీపీ దాడులు, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా తదితర అంశాలతో పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవశ్యకతను అమిత్ షాకు వివరించారు. పూర్తి సమాచారాన్ని వీడియోలతో పాటు పంపుతానని, తగిన చర్యలు తీసుకోవాలని షాను చంద్రబాబు కోరారు.