Assembly Elections 2022: ఓ పక్క దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నా ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అత్యంత ఆవశ్యకమైన నేపథ్యంలో యుపి సహా అయిదు రాష్ట్రాల్లో షెడ్యుల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సీఈసీ సిద్దమైంది. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్త తీసుకుని ఎన్నికల నిర్వహణకు సీఈసీ ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేసింది. దేశంలోనే అతి పెద్ద రాష్టమైన ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుశీల్ చంద్ర విడుదల చేశారు. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాయి.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుశీల్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే లు పాల్గొన్నారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని సీఈసీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో ఏడు దశలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఫిబ్రవరి 10న తొలి దశ ఎన్నికలు జరుగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయిదు రాష్ట్రాల్లో మార్చి 7 నాటికి పోలింగ్ ముగుస్తుంది. మార్చి 10న కౌంటింగ్ జరుగుతుంది. కోవిడ్, ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలు, ఆరోగ్య నిపుణులతో చర్చించిన తరువాతే తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతున్నామని సుశీల్ చంద్ర తెలిపారు.