Chandra babu: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని టీడీపీ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గురువారం మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో చీరాల త్రిసభ్య కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు, జివి నాగేశ్వర రావు, రాయపాటి సీతయ్య లు కలిశారు.
ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణం తీరు తెన్నులను చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చీరాలలో పార్టీకి బలమైన క్యాడర్ టీడీపీ సొంతమన్నారు. పార్టీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం కృషి చేయాలన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నేతలు మండూరి రజినీకాంత్, నార్నెపాటి శరత్ తదితరులు పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం టీడీపీని వీడి వైసీపీ పంచన చేసిన నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.