Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. 70 రోజులకుపైగా విచారణ సాగిస్తున్న సీబీఐ అధికారులు ఇప్పుడు కీలక అనుమానితులను విచారిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్, పులివెందుల ఆర్ అండ్ బీ అతిధి గృహం కేంద్రంగా అనుమానితులను సీబీఐ విచారణ చేస్తున్నది. ఇటీవల కాలం వరకూ సీబీఐ చిన్న స్థాయి వ్యక్తులను మాత్రమే విచారణ చేస్తుండటంతో కేసు పక్కదారి పడుతోందా, కీలక అనుమానితులను ఎందుకు విచారించడం లేదు అన్న ప్రశ్నలు తలెత్తాయి. వివేకా కుమార్తె డాక్టర్ సునీత గతంలో పలువురు ప్రముఖుల పేర్లతో అనుమానితుల జాబితా సీబీఐకి అందజేసిన సంగతి తెలిసిందే.
వాచ్ మెన్ రంగన్న వాగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయించడం, ఆ తరువాత వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అరెస్టు చేయడంతో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే దివంగత సీఎం వైఎస్అర్, సీఎం జగన్ బంధువులను సైతం సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. సీబీఐ అధికారుల విచారణలో భాగంగా కడప ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అధికారులు మంగళవారం పులివెందుల గెస్ట్ హస్ లో ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో బాస్కరరెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. మరో పక్క కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు మరో బృందంగా జగదీశ్వరరెడ్డి, భరత్ కుమార్ లను విచారించారు. వీరిలో జగదీశ్వరరెడ్డి వైఎస్ వివేకా పొలం పనులు చూసేవారు కాగా, భరత్ కుమార్ సీబీఐ అరెస్టు చేసిన సునీల్ కుమార్ యాదవ్ బందువు. నాలుగు రోజుల క్రితం ఎంపి అవినాష్ రెడ్డి పీఎలను సీబీఐ పిలిపించి విచారించింది.