Road Accident: ప్రకాశం జిల్లాలో జరిగిన రెండు వేరువేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా మరో 19 మంది గాయపడ్డారు. మార్కాపురం మండలం మిట్టమీదిపల్లె గ్రామ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో తండ్రి, కుమార్తె మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొండపల్లికి చెందిన ఓ కుటుంబం అర్ధవీడులో ఓ వివాహ వేడుకకు హజరై తిరిగి వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. లారీని కారు ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. కారులోనే రెండు మృతదేహాలు ఇరుక్కుపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
జిల్లాలోని పెద్దారవీడు మండలం చట్లమిట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. వ్యవసాయ కూలీలతో వెళతున్న ఆటో చట్లమిట్ట వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని నరసరావుపేట, మార్కాపురం ఆసుపత్రులకు తరలించారు. ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.