Brother Anil Kumar: బ్రదర్ అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విజయవాడలో క్రైస్తవ, మైనార్టీ బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన బ్రదర్ అనిల్ నేడు విశాఖలోని ఓ హోటల్ లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీ గెలుపునకు కృషి చేసిన కొన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారనీ, వారు తనతో బాధలు చెప్పుకున్నారన్నారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చానన్నారు. జగన్ బిజీగా ఉండటం వల్ల రెండున్నరేళ్లుగా కలవలేదని చెప్పారు. సమయం కుదిరినప్పుడు కచ్ఛితంగా కలిసి వారి సమస్యలను తెలియజేస్తానన్నారు.
తనను కలిసిన వాళ్లకు సాయం చేస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. వారి నుండి పార్టీ పెట్టాలని కూడా డిమాండ్ వస్తుందనీ, పార్టీ పెట్టడం అంటే సులభం కాదని అన్నారు. తాను పార్టీ పెట్టకపోతే వాళ్లే పార్టీ పెడతామని అంటున్నారని తెలిపారు. వాళ్లు పార్టీ పెడితే తాను మద్దతు ఇస్తానని తెలిపారు. సమయం వచ్చినప్పుడు ఏపిలో పార్టీపై తాను స్పష్టత ఇస్తానని బ్రదర్ అనిల్ చెప్పారు. తరచుగా వివిధ సంఘాల ప్రతినిధులతో బ్రదర్ అనిల్ భేటీలు అవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎపి సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు షికారు చేస్తున్న క్రమంలో బ్రదర్ అనిల్ ఏపిలో పర్యటనలు చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.