AP Assembly: ఏపి అసెంబ్లీ నుండి అయిదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అయిదవ రోజైన సోమవారం ప్రశ్నాత్తరాలు ప్రారంభం అయినప్పటి నుండి టీడీపీ సభ్యులు జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ సారా మరణాలపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ..సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. స్పీకర్ పై కాగితాలు విసిరివేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పలు మార్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆగ్రహం వ్యక్తం చేసినా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. టీడీపీ సభ్యుల తీరును అధికార పక్షం తీవ్రంగా విమర్శించింది. శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్ తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రజల కోసం ఎన్టీఆర్ మధ్య నిషేదం తీసుకువస్తే చంద్రబాబు మద్య నిషేదానికి తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు.
సభలో గొడవ చేస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం లో జరిగిన మరణాలను టీడీపీ వక్రీకరిస్తోందని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో జరిగినవి సాధారణ మరణాలనీ, టీడీపీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జంగారెడ్డిగూడెంలో చంద్రబాబు పర్యటన చేస్తున్నందున టీడీపీ సభ్యుడు అక్కడకు వెళ్లేందుకు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో మద్యాన్ని ఏరులై పారించారనీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మద్యం బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి 40వేల షాపులు తెరిచారని ఆమె దుయ్యబట్టారు. టీడీపీ సభ్యుల తీరును పలువురు సభ్యులు తప్పుబట్టారు. మద్యం పై మాట్లాడే అర్హత టీడీపీ వాళ్లకు లేదని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయం సజావుగా జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని దుయ్యబట్టారు.
టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగుతున్న క్రమంలో స్పీకర్ తమ్మినేని రెండు సార్లు సభను అయిదు అయిదు నిమిషాల సేపు వాయిదా వేశారు. ఆ తరువాత ప్రారంభమైన సభలోనూ టీడీపీ సభ్యులు అదే విధంగా గొడవ చేయడంతోసభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న కారణంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అయిదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరి, బాల వీరాంజనేయులు. పయ్యావుల కేశవ్ లను బడ్జెట్ సమావేశాల చివరి వరకూ సస్పెన్షన్ విధించారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించడం లేదని స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ టీడీపీ వాస్తవాలను వక్రీకరిస్తూ శవరాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అక్రమ మధ్యం అమ్మకాలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు అయిన విషయాన్ని గుర్తు చేశారు. సాధారణ మరణాలను సైతం కల్తీ సారా మరణాలుగా టీడీపీ చిత్రీకరిస్తోందని దుయ్యబట్టారు.