Road Accident: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కల్వర్టును కారు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుండి జంగారెడ్డిగూడెం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెంకు చెందిన ఆరుగురు కారులో హైదరాబాద్ నుండి వెళుతుండగా జగ్గయ్యపేట మండలం గౌరవరం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు సాగర్ కెనాల్ కల్వర్టు వాల్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేషనల్ హైవే టీమ్, మొబైల్ పోలీస్ టీమ్ సభ్యులు సహాయక చర్యలు చేపట్టారు. చిల్లకల్లు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ఇందిరా, శాంతి, కుటుంబరావు, ప్రిన్సీ (ఆరు నెలలు) మృతి చెందినట్లు సమాచారం.