Big Breaking: ఏపిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కౌంటింగ్ కు గ్రీన్సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1న ఎస్ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన ఆదేశాల ఆధారంగా ఏప్రిల్ 8న రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్ పీ టీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలు సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్దంగా జరిగాయంటూ జనసేన, టీడీపీ హైకోర్టు ను ఆశ్రయించగా విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ ఏడాది మే 21న ఎన్నికలను రద్దు చేస్తూ కీలక తీర్పును ఇచ్చింది. ఈ తీర్పుపై ఎస్ఈసీతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టు డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆగస్టు 5న తీర్పును రిజర్వు చేసింది. ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె ఉమాదేవితో కూడిన ధర్మాసనం..సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తోసి పుచ్చుతూ ఎన్నికల కౌంటింగ్ కు అనుమతి ఇస్తూ తీర్పు వెల్లడించింది.