ఏపి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులైన ప్రముఖ హస్య నటుడు ఆలీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అధికారులు వెంట రాగా ఆలీ తన ఛాంబర్ లోకి ప్రవేశించారు. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేతుల మీదుగా ఆలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలీ మీడియాతో మాట్లాడారు. తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడం పట్ల సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా తాను ఏమి చేయాలన్న దానిపై ఒక వారంలో ఖరారు అవుతుందని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై దృష్టి పెడతానని ఆలీ పేర్కొన్నారు. ఇటీవల తాను ఉత్తరాంధ్ర లో షూటింగ్ కు వెళ్లిన సందర్భంలో అక్కడ బీచ్ లు, రోడ్లు చూసిన తర్వాత వాటిని కొద్దిగా అభివృద్ధి చేస్తే తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషా మువీలు కూడా ఇక్కడ షూటింగ్ లు జరుపుకుంటాయని ఆలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని వల్ల ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. సీఎం వైఎస్ జగన్ మనసున్న మనిషి అని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే ఘన విజయమని ఆలీ పేర్కొన్నారు.