AP CM YS Jagan: ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలుగొండ ప్రాజెక్టు రెండో టన్నల్ 2023 నాటి పూర్తి చేస్తామని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఒంగోలు పట్టణంలోని పివీఆర్ బాలుర హైస్కూల్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల బాధలు అన్నీ చూశానన్నారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. రెండవ విడత కింద డ్వాక్రా గ్రూపు మహిళలకు రూ.6,439.52 కోట్లు జమ చేస్తున్నామన్నారు. నాలుగు విడతల్లో మొత్తం రూ.25,517 కోట్లు జమ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా కడప జిల్లా నవంబర్ 6 నుండి 15వ తేదీ వరకు ఆసరా పథకం అమలు చేస్తామన్నారు.
దేవి శరన్నవరాత్రి వేడుకల ప్రారంభం రోజున ఈ పథకాన్ని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని విమర్శించారు. ఇదే సందర్భంలో ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణ ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి హామీ ఇచ్చారు జగన్. ఒంగోలు పట్టణంలో నాలుగు రోజులకు ఒక సారి మంచినీటి సరఫరా జరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను నేతలు ఆయన దృష్టికి తీసుకురాగా రూ.400 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు సభా ముఖంగా సీఎం హామీ ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మొదటి టన్నల్ నీళ్లు వచ్చే ఏడాది ఆగస్టులో అందిస్తామని తెలిపారు. తొలుత సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం జగన్ పరిశీలించారు. డ్వాక్రా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు ప్రసంగించారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.