TDP MLAS Letter: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయులు, ఏలూరి సాంబశివరావులు సీఎం వైఎస్ జగన్ కు జిల్లాలోని ప్రధాన సమస్యలపై బహిరంగ లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టు, సాగునీటి సమస్య, రైతాంగ సమస్యలు, నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదల, విద్యుత్ చార్జీల పెంపు, టిడ్కో ఇళ్లు, ఫించన్ తదితర సమస్యలను లేఖలో ప్రస్తావించారు.
ప్రకాశం జిల్లా వరప్రదాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు ను కేంద్రం ప్రకటించిన గెజిట్ లో అనుమతి పొందిన ప్రాజెక్టు గా చేర్చకపోవడం వల్ల పశ్చిమ ప్రాంత రైతాంగ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యిందనీ, తక్షణం కళ్లు తెరిచి కేంద్ర గెజిట్ లో అనుమతి పొందిన ప్రాజెక్టుగా చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంను లేఖలో కోరారు. అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్చూరు ప్రాంత రైతుల దశాబ్దాల కల అయిన గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో మంజూరైన రూ.274 కోట్ల పథకాన్ని రద్దు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. సుబాబుల్, జామాయిల్, వరి, మొక్కజొన్న, కంది,శనగ పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించక, ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రైతులకు, యువతకు మేలు చేసే అదిపెద్ద ప్రైవేటు రంగ పెట్టుబడి ఏషియన్ పల్స్ పేపర్ మిల్ ప్రాజెక్టు ను జిల్లా నుండి తరిమివేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ ద్వారా వేలాది మంది యువతకు చేయూతనందించే సబ్సిడీ రుణాలన రద్దు చేయడం దురదృష్టకరమని ఆయా వర్గాల ఆర్ధిక ఎదుగుదలకు ఆటంకం కలిగించడం సబబేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇంత వరకూ అమలు చేయకపోవడం అమానుషమన్నారు. విదేశీ విద్యా పథకం రద్దు చేయడం వేలాది మంది యువత భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పేద మధ్య తరగతి వర్గాలు బెంబేలెత్తిపోతున్నారనీ, దీనికి తోడు ప్రజలపై చెత్త పన్ను విధించడం ఏమిటని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు ట్రూ ఆప్ చార్జీల పేరుతో సామాన్యులపై పెనుభారం మోపారని దీని వల్ల సెప్టెంబర్ నెలలోనే ప్రకాశం జిల్లాలో ప్రజలప 25కోట్ల మేర అదనపు భారం పడిందన్నారు. టీడీపీ హయాంలో 90 శాతం నిర్మాణం పూర్తి అయిన టిడ్నో ఇళ్లను పూర్తి చేసి ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు కక్షసాధింపు రాజకీయాలతో ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభం దిశగా పయనిస్తోందన్నారు. ఈ పరిశ్రమకు గతంలో అనేక హామీలు ఇచ్చి మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు భారాలు వేసి పరిశ్రమల మూసివేతకు కారణమయ్యారని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఆ హామీని ఇంత వరకూ అమలు చేయకపోగా ఉన్న పెన్షన్లకు సవాలక్ష కారణాలు చెబుతూ తొలగించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు అన్నది జగమెరిగిన సత్యమని అన్నారు. రాష్ట్రంలో అన్ని రహదారులు అధ్వాన్న స్థితికి చేరాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించి ప్రజల ఆశలు, అకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.