Actor Ali: ప్రముఖ సినీనటుడు ఆలీ మంగళవారం కుటుంబ సమేతంగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. ఇటీవలే సినీ పరిశ్రమ సమస్యలపై చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులతో కలిసి సీఎం జగన్ తో ఆలీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీ జరిగి వారం తిరగకముందే ఆలీకి సీఎంఓ నుండి కబురు రావడంతో నేడు కుటుంబ సమేతంగా వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. ఆలీకి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ ను ఆలీ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే రాజ్యసభ సీటు ఇస్తారనే విషయం తనకు తెలియదనీ, అలాంటి సంకేతాలు ఏవీ సీఎం ఇవ్వలేదని చెప్పారు ఆలీ. సీఎంతో భేటీ అనంతరం ఆలీ మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలో పార్టీ కార్యాలయం నుండి అధికారికంగా ఒక ప్రకటన ఉందని అన్నారు. తాను సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ సీఎం కాకముందు నుండే వారి కుటుంబంతో తనకు పరిచయం ఉందన్న ఆలీ 2004 లో వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన తర్వాత కలిసినట్లు చెప్పారు. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తాననీ తాను అనలేదన్నారు. గత సాధారణ ఎన్నికల సందర్భంలోనే తనకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారని అయితే సమయం లేక తానే వద్దని చెప్పానని అన్నారు అలీ.
సినీ ప్రముఖులను ఇటీవల పిలిచి సీఎం జగన్మోహనరెడ్డి అవమానించారని వస్తున్న ప్రచారం అవాస్తమని అలీ అన్నారు. చిరంజీవి వచ్చినప్పుడు సీఎం జగన్ చాలా గౌరవంగా చూశారని చెప్పారు. ఏపిలో సినిమా టికెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలన్నీ సీఎం జగన్ కు వివరించామనీ, త్వరలో సినిమా కష్టాలు తీరుతాయని ఆలీ పేర్కొన్నారు.