Tuition Teacher rape: మహిళలు, బాలికల సంరక్షణకు అనేక కఠన చట్టాలు ఉన్నప్పటికీ ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న లైంగికదాడులు, అత్యాచారాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. ముఖ్యంగా ఏపిలో దిశ చట్టాన్ని తీసుకువచ్చి దిశ పోలీసు స్టేషన్ లను ఏర్పాటు చేశారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, లైంగికదాడులకు పాల్పడితే వేగవంతంగా దర్యాప్తును పూర్తి చేసి త్వరితగతిన నేరం చేసిన వారికి శిక్షలు అమలు చేసేందుకు జగన్ సర్కార్ దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. అయినప్పటికీ ఇటీవల మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు జరుగుతునే ఉన్నాయి. కొందరు దుర్మార్ఘులు కామంతో కళ్లుమూసుకుపోయి మృగాళ్లుగా మారి చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో పెట్టే గౌరవ ప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ యువకుడు.. తన వద్దకు ట్యూషన్ కోసం వచ్చే విద్యార్థిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే..విజయనగరం జిల్లా గంట్యాట ప్రాంతానికి చెందిన చిన్నా అనే యువకుడు బీఈడీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్ లు చెబుతున్నాడు. వివాహితుడైన చిన్నా ఇంటి వద్ద ట్యూషన్ కు అనేక మంది పిల్లలు వస్తున్నారు. పిల్లలకు బాగానే పాఠాలు చెబుతున్నాడని పలువురు పదవ తరగతి పిల్లలను ట్యూషన్ కు పంపుతున్నాడు. ఇదే క్రమంలో ట్యూషన్ కు వచ్చిన పదవ తరగతి బాలికలపై కన్నేశాడు ట్యూషన్ మాస్టర్ చిన్నా. ఏడు నెలల క్రితం ఓ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే పరీక్ష ఫెయిల్ చేయిస్తానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే గత కొద్ది రోజులుగా ఆ బాలిక అస్వస్థతకు గురి కావడం, కళ్లు తిరిగి పడిపోతుండటంతో పాటు పొట్ట కూడా ఎత్తుగా ఉండంటంతో అనుమానంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఏడవ నెల గర్భవతి అని చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ బాలికను నిలదీయడంతో ట్యూషన్ మాస్టార్ చిన్నా బాగోతం వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విజయనగరం దిశ పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. బాలికలను చైతన్య పరిచేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.