Veligonda Project Issue: వెలిగొండ ప్రాజెక్టు అంశంపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల బృందం మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసింది. కేంద్రం జారీ చేసిన గెజిట్ లో వెలిగొండ ప్రకటించలేదనీ, తక్షణమే వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ లో చేర్చాలని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను టీడీపీ నేతల బృందం విజ్ఞప్తి చేసింది. ఇంతకు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిక మూడు లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లభించకపోవడంతో కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కోరారు.
మంత్రి షెకావత్ నేడు సమయం కేటాయించడంతో ఢిల్లీకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డా డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, బి ఎన్. విజయ్ కుమార్ ముత్తముల అశోక్ రెడ్డి, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బోలినేని రామారావు, దామచర్ల సత్యలు కేంద్ర మంత్రిని కలిశారు. వెలిగొండ ప్రాజెక్టు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న విషయాన్ని మంత్రికి వివరించారు. ప్రకాశం జిల్లా కరువు కాటకాలు, ప్రజల ఇబ్బందులు, త్రాగు,సాగు నీటి సమస్యలను వివరించి తక్షణమే వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతి కలిగిన ప్రాజెక్టుగా గెజిట్లో చేర్చాలని కోరారు. తాము చెప్పిన విషయాలను సావధానంగా విన్న కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారని టీడీపీ నేతల బృందం తెలిపింది.