Letter to CM: ప్రకాశం జిల్లా ప్రజల స్వప్నం వెలుగొండ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ లో చేర్చే విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖలు రాశారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇకనైనా స్పందించాలంటూ టీడీపీ నేతలు మరో లేఖ రాశారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో కరువు కాటకాలతో జిల్లా ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు, తాగు నీటి అవసరాల కోసం ప్రకాశం జిల్లా ప్రజానీకం, రైతాంగం ఏళ్ల తరబడి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇక్కడి ప్రజలు వలసబాట పడుతున్నాని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని ఆరు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలో రెండు నియోజకవర్గాలు, కడప జిల్లాలోని ఒక నియోజకవర్గానికి తాగు, సాగునీటిని అందించే వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్తో ప్రకాశం జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందనీ, గతంలో పలుమార్లు బహిరంగ లేఖ ల ద్వారా ఈ విషయాన్ని తమరి దృష్టికి తీసుకువచ్చామనీ కానీ తమరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతి లేదంటూ ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుకు లేఖ రాసిందని గుర్తు చేశారు. విభజన చట్టంలో వెలిగొండ ప్రాజెక్టు స్పష్టంగా పేర్కొనబడిన విషయాన్ని మరో మారు గుర్తు చేశారు. ప్రాజెక్టు మొదటి టన్నెల్ పూర్తయినప్పటికీ నీళ్లు ఇవ్వలేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్లో చేర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాజకీయ కోణంలో చూడకుండా ప్రకాశం జిల్లా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద మనసుతో స్పందించాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై చేస్తున్న కుటిల యత్నాలను తిప్పి కొట్టాలని కోరారు. లేకుంటే ప్రకాశం జిల్లా ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితుల తలెతుత్తాయన్నారు. తమరు స్పందించకుంటే ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. లేఖ పై అద్దంకి, కొండపి, పర్చూరు టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ముత్తముల అశోక్ రెడ్డి, దామచర్ల జనార్ధన్ రావు, కందుల నారాయణ రెడ్డి, డా.ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, పోతుల రామారావు, డా. దివి శివరాం, బి.ఎన్. విజయకుమార్ తదితరులు సంతకాలు చేశారు.