Pawan Kalyan: కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరుకి విచ్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభిమానులు, కార్యకర్తల నుండి ఘన స్వాగతం లభించింది. బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి లక్ష వంతున ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా వారి కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అందించారు పవన్ కళ్యాణ్. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి రోడ్డు మార్గంగా వచ్చిన పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా జనసైనికులు, అభిమానులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దసరా వరకూ వైసీపీ వాళ్లు ఏమి మాట్లాడినా భరిస్తామనీ, అప్పటి నుండి ప్రజల్లోనే ఉండి వాళ్ల సంగతి చూస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. పొత్తుల గురించి మాట్లాడే సమయం ఇది కాదనీ, పాత్తు ప్రజలతోనే ఇంకెవరితోనూ లేదని స్పష్టం చేసారు. 2024 లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికే మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రూ.5కోట్లు అప్పులు చేసింది. ఆ అప్పు ఏమి చేశారని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నించాలన్నారు. 2014 లో తాను పోటీకి దిగి ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావని పవన్ అన్నారు.
వైసీపీ నాయకులు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని పవన్ విమర్శించారు. బాధ్యతలేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు వచ్చే ఎన్నికలు చాలా కీలకమన్నారు. నిరుద్యోగులకు జనసేన అధికారంలోకి వస్తే జాబ్ కాలెండర్ ప్రకటిస్తామని, రైతు ప్రయోజనాలు కాపాడతామని హామీ ఇచ్చారు. చాలా సార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారు. ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్.