Online Prakasam: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా మంగళవారం 9 మంది ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ 9 మందిలో ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది పమిడిఘంటం శ్రీనరసింహా ఉండటం ఈ ప్రాంత ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా మోదేపల్లి గ్రామంలో జన్మించిన నరసింహ విద్యాభ్యాసమంతా హైదరాబాద్ లోనే సాగింది. బడీ చౌడీలోని సెయింట్ అంథోనీ స్కూల్ లో, నిజాం కళాశాలలో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీ కి వెళ్లి న్యాయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. తదుపరి అక్కడే ప్రాక్టీసు ప్రారంభించి కొనసాగించారు. నరసింహ తండ్రి జస్టిస్ పమిడిఘంటం కోదండరామయ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు.
ఢిల్లీ న్యాయవాదుల్లో మేథావిగా, పండితుడుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ నరసింహ సుప్రీం కోర్టు కోలీజియం తీసుకున్న నిర్ణయం కారణంగా న్యాయవాద వృత్తి నుండి నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2028 లో కొద్ది కాలం పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించే అధ్బుత అవకాశం ఈ తెలుగుతేజంకు దక్కనున్నది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తరువాత ఆ బాధ్యతలు నిర్వహించే తెలుగు వాడు నరసింహే అవుతారు.
1990 నుండి సుప్రీం కోర్టు న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న నరసింహకు గతంలో హైకోర్టు న్యాయవాదిగా అవకాశం వచ్చినా వెళ్లడానికి ఇష్టపడలేదు. 2014 -18 మధ్య కాలంలో నాలుగేళ్లు అదనపు సొలిసిటర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహించినా ఆ పదవి నుండి తప్పుకుని న్యాయవాదిగానే ఉండేందుకు ఇష్టపడ్డారు నరసింహ. కోర్టులో వాదించడం, కీలకమైన ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించడం తనకు ఇష్టమని చెబుతుంటారు జస్టిస్ నరసింహ.
జస్టిస్ నరసింహ కుటుంబ విషయానికి వస్తే ఆయన తోబుట్టువులు అంతా విద్యాధికులే. ఆయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు ఉన్నారు. నరసింహ పెద్దన్నయ్య రఘురామ్ సీనియర్ న్యాయవాది. మరో అన్నయ్య కాశీ విశ్వనాధ సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఒక అక్క తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ కాగా మరో అక్క కెనడాలో సుదీర్ఘకాలం పాటు లైఫ్ స్కిల్స్ కౌన్సిలర్ గా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన ఇద్దరు బావలు శాస్త్రవేత్తలు.