Ongole Politics: ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లు తాజాగా కార్యకర్తలపై చేసిన కీలక కామెంట్స్ జిల్లాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఒంగోలులోని ఏ 1 ఫంక్షన్ హాలు నందు జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఎంపి మాగుంట ఇటీవల బుర్రా మధుసూధన్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బుర్రా మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై తొలుత ఎంపి శ్రీనివాసులు రెడ్డి పార్టీ కార్యకర్తల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కౌంటర్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేయడం జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.
ఎవరు ఎమన్నారు అంటే …
మాగుంట శ్రీనివాసులు రెడ్డి:”తాను గతంలో టీడీపీ, కాంగ్రెస్ లో పని చేశాను. పార్టీ ఏదైనా కార్యకర్తలే బలం. కార్యకర్తలు ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం కష్టపడతారు. పార్టీలు ఉన్నాయంటే దానికి కారణం కార్యకర్తలే. సమావేశానికి పిలిస్తే పెండింగ్ బిల్లులు వచ్చేలా చూడాలని కార్యకర్తలు అడిగి పరిస్థితి వచ్చింది” అని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. మాగుంట గతంలో టీడీపీలో ఉన్న సమయంలోనూ టీడీపీ కార్యకర్తల గురించి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైసీపీలో కార్యకర్తల గురించి మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది. మాగుంట ఇప్పుడే అలా ఎందుకు మాట్లాడారు అని అనుకుంటున్నారు. మాగుంట కీలక కామెంట్స్ చేసిన వెంటనే అదే వేదికపై బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యకర్తల విషయంలో తన వైఖరి ఏమిటో తెలియజేస్తూ ఘాటుగా మాట్లాడారు. దీంతో మాగుంట మాటలకు ఇవి కౌంటర్ యే అని అనుకుంటున్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి: “మంత్రి పదవి నుండి తొలగించినప్పుడు చాలా బాధపడ్డాను. తాను గతంలో మంత్రి పదవి వదులుకుని వైసీపీలోకి వచ్చా. మూడేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంజాయ్ చేశారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలను సహించము. కార్యకర్తలకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను. నాపై సీఎంకు ఫిర్యాదు చేసినా భయపడను” అని పేర్కొన్నారు. మంత్రి పదవి అడిగాను కానీ సురేష్ కు మంత్రి పదవి ఇవ్వదని తాను చెప్పలేదని బాలినేని వెల్లడించారు. ఒకరి తరువాత మరొకరు పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడటంతో వారి మధ్య అంతర్గత వైరుధ్యం ఇంకా కొనసాగుతున్నట్లే ఉందని అనుకుంటున్నారు.