Breaking: ఏపి సీఐడీ అధికారులు మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను అదుపులోకి తీసుకున్నారు. పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్న నారాయణను సీఐడీ అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల టెన్త్ క్లాస్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయులు ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిసింది. ఈ నేపథ్యంలో ఏపి సీఐడీ అధికారులు మంగళవారం హైదరాబాద్ కొండాపూర్ కు వెళ్లి నారాయణ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఏపిలో పదవ తరగతి పరీక్షల ప్రారంభంలో పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నా పత్రాలను వాట్స్ ఆప్ ద్వారా బయటకు పంపిన విషయం తెలిసిందే. ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది.
ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. ప్రశ్నా పత్రాల లీకేజీ అంశంలో పది మందికిపైగా ఉపాధ్యాయులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ప్రస్తుతం నారాయణను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు అనే విషయాన్ని సీఐడీ అధికారులు వెల్లడించలేదు. ఆయన సొంత కారులోనే హైదరాబాద్ నుండి ఏపికి తరలిస్తున్నారు ఏపీ సీఐడీ అధికారులు.