Ongole News: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శల దాడి చేస్తూ వార్తల్లోకి ఎక్కిన ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తా పై అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. వైసీపీ ప్రభుత్వ విధానాలపై గతంలో సుబ్బారావు గుప్తాపై, ఆయన ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సుబ్బారావు గుప్తా తాను వైసీపీ కార్యకర్తనే అని చెప్పుకుంటూనే ఆ పార్టీ నేతలను విమర్శిస్తూ ఉన్నారు. ఢిల్లీకి వెళ్లి వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణంరాజును కలిశారు.
కొందరు ఆర్యవైశ్య సంఘం నేతలు కూడా తొలుత సుబ్బారావు గుప్తాపై దాడిని ఖండించారు. ఆయనకు బాసటగా నిలిచారు. ఇటీవల కాలంలో పలు టీవీ డిబేట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సుబ్బారావు గుప్తా పాల్గొంటూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా సుబ్బారావుగుప్తాపై ఒంగోలులో అట్రాసిటీ కేసు నమోదు కావడం చర్చనీయంశం అవుతోంది.
గతంలో కార్పోరేషన్ సిబ్బంది తొలగించిన పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం నిన్న మేయర్ గంగాడ సుజాతను సుబ్బారావు గుప్తా కలిశారు. అయితే సుబ్బారావు గుప్తా తనను దషించారంటూ మేయర్ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేయర్ ఫిర్యాదుతో సుబ్బారావు గుప్తా పై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.