AP Assembly Session: ఏపి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వరుసగా మూడు రోజుల నుండి జంగారెడ్డిగూడెంలో జరిగిన వరుస మరణాల అంశం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారాతో మరణాలు సంభవిస్తే ప్రభుత్వం సహజ మరణాలు అంటూ తప్పుడు వివరణ ఇస్తుందంటూ టీడీపీ సభ్యులు ఉభయ సభల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ చర్చకు ప్రభుత్వం అనుమతించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో జంగారెడ్డిగూడెం మరణాలపై వివరణ ఇచ్చారు. టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని, అవాస్థవాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. శాసనసభలో ప్రశ్నోత్తరాలు జరిపేందుకు అవకాశ లేకుండా టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ 11 మందిని ఒక్క రోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన టీడీపీ సభ్యులు సభ నుండి బయటకు వెళ్లిన తరవాత సజావుగా సభ కొనసాగుతోంది.
కాగా శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా ప్రభుత్వం చిత్రీకరిస్తోందని, ఈ మరణాలపై చర్చ జరపాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరును అధికార పక్షం తప్పుబట్టింది. టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే చైర్మన్ మోషేన్ రాజు ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. సభ ఆర్డర్ లో లేకుండా కొనసాగించడం సరికాదని బీజేపీ ఎమ్మెల్సీ మాథవ్ అన్నారు. ఫ్లోర్ లీడర్ల సమావేశం ఏర్పాటు చేసి సభ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మాధవ్ సూచించారు. టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో మండలి చైర్మన్ మోషేన్ రాజు సభను వాయిదా వేశారు.