టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బటన్ నొక్కితే బీసీ సర్టిఫికెట్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 167వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో లోకేష్ పాదయాత్రకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఒంగోలు శివారు రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట గురువారం నిర్వహించిన జయహో బీసీ సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో బీసీలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయభాను సంధానకర్తగా వ్యవహరించారు. దాదాపు అయిదేళ్ల విరామం తర్వాత యాంకర్ ఉదయభాను సంధానకర్తగా ఈ కార్యక్రమానికి హజరై ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ బీసీలకు వరాలను ప్రకటించారు. బీసీ సోదరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఇచ్చాపురం చేరుకునే వరకూ విశ్రమించేది లేదు
లోకేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యువగళం పాదయాత్ర చేపట్టాననీ, ఈ సుదీర్ఘ పాదయాత్రలో అట్టడుగు స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బాధలు నేరుగా చూడగలిగానన్నారు. పాదయాత్రలో ప్రజల స్పందన బాగుందని, నాయకులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. రేపటికి 2200 కిలో మీటర్ల మైలు రాయి దాటబోతున్నానని అన్నారు. ఇప్పటి వరకూ సుమారు ఆరు నెలల్లో 60 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరిగిందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ ప్రయాణం ఇచ్చాపురం చేరుకునే వరకూ విశ్రమించేది లేదని తెలిపారు. బీసీల పట్ల తమ చిత్తశుద్ది గతంలో అనేక కార్యక్రమాల ద్వారా చేసి చూపించామని అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు ఎన్టీఆర్ సీఎం అయ్యాక పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, బీసీలను మంత్రులు, ఎంపీలు, స్పీకర్ లను టీడీపీ చేసిందన్నారు.
ఎన్టీఆర్ హయాంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 24 శాతం రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు దాన్ని 34 శాతానికి పెంచారన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెట్టి నిధులను కేటాయించి కేవలం బీసీలకే చంద్రబాబు ఖర్చు పెట్టారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తామనీ, అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విదంగా బీసీలకు రక్షణ చట్టాన్ని అధికారంలోకి వలచ్చిన మొదటి సంవత్సరంలోనే తెస్తామనీ, న్యాయపోరాటానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే అంశాన్ని ఈ చట్టంలో భాగంగా రూపొందిస్తామని తెలిపారు. అమర్నాధ్ గౌడ్ కుటుంబ సభ్యులకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుల వృత్తుల వారికి సబ్సిడీలు ఇచ్చే చర్యలు టీడీపీ తీసుకుంటుందన్నారు. దమాషా ప్రకారం ఉపకులాల వారీగా నిధులు కేటాయిస్తామని, కార్పోరేషన్ లు ఏర్పాటు చేసి వాటి నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించకుండా కేవలం సబ్సిడీ రుణాల కోసం మాత్రమే కేటాయిస్తామని తెలిపారు.
బీసీల్లోని చిన్న చిన్న కులాలకు చెందిన నాయకులను పైకి తీసుకురావడమే కాకుండా పార్టీకి బాగా కష్టపడుతూ, ప్రజల మధ్య ఉన్న వారికి పెద్ద పీట వేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందన్నారు. సీనియర్ లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తామని, పని చేసే వారికి ప్రోత్సహిస్తామని తెలిపారు. గౌడ కులస్తులకు నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తామనీ, అంతే కాకుండా మద్యం దుకాణాల్లో బీసీలకు రిజర్వేషన్ లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ జనగణనపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి జరిగేలా చూస్తామని తెలిపారు. ఇదే క్రమంలో జగన్మోహనరెడ్డి సర్కార్ ను విమర్శలు చేశారు.