Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమన్నారో అందరికీ తెలుసు కదా..ఢిల్లీలో మా కుటుంబం వ్యాపారం చేయడం లేదు. మాగుంట ఇంటి పేరుతో ఉన్న వాళ్లు అక్కడ వ్యాపారం నిర్వహిస్తుండటంతో పొరబాటున తామే అనుకుని మా సంస్థల్లో తనిఖీలు చేశారు. ఆ కేసులో, అక్కడి వ్యాపారాలతో తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. దశాబ్దాల తరబడి ఎటువంటి మచ్చ లేకుండా తాము లిక్కర్ వ్యాపారం చేస్తున్నాం అంటూ మీడియా సమావేశం పెట్టి మరీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాటలు చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అంటే ఫిబ్రవరి 10న మాగుంట కుమారుడు రాఘవ రెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సౌత్ గ్రూప్ లో రాఘవ కీలక పాత్రదారుల్లో ఒకరుగా ఈడీ పేర్కొంది. ఢిల్లీలోని పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.
అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవ
అయితే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాటలు నమ్మిన వారు మాత్రం ఏదో ఆరోపణలతో కేసు నమోదు చేసి ఉంటారని భావించారు. కానీ అనూహ్యంగా మాగుంట రాఘవ ఈ కేసులో అప్రూవర్ గా మారుతున్నట్లు ప్రకటించి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆరు నెలల పాటు తీహార్ జైలు లో ఉన్న రాఘవ కు న్యాయస్థానం ఈ నెల మూడవ వారంలో అనారోగ్య కారణాలపై మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు న్యాయస్థానం రాఘవకు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాఘవ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని ఈడీ వ్యతిరేకించలేదు. గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్ మంజూరు చేయగా, దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న రాఘవ గురువారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరైయ్యారు. తన తండ్రి, ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి కోర్టుకు హజరైన రాఘవ న్యాయమూర్తి ముందు 164 కింద వాంగ్మూలాన్ని ఇచ్చారు.
మరో వైపు ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాఘవ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వచ్చే నెల 10వ తేదీన ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్నది. ఈ తరుణంలో రాఘవ అప్రూవర్ గా మారుతూ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే సౌత్ గ్రూపు లో కీలక నిందితుడైన శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్ గా మారారు. శరత్ చంద్రారెడ్డికి కూడా బెయిల్ మంజూరు కావడంతో బయటే ఉన్నారు. గతంలో ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన శ్రీనివాసులు రెడ్డి ..ఇప్పుడు తన కుమారుడిని కేసులో అప్రూవర్ గా ఎందుకు మార్చారు అనేది ఆ జగన్నాటక సూత్రధారికే తెలియాలి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. అప్రూవర్ గా మారుతున్న వారి బెయిల్ మంజూరునకు న్యాయస్థానంలో ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ఈ కేసులో అరెస్టు అయిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా సహా పలువురికి బెయిల్ మంజూరు కాక తీహార్ జైలులోనే ఉన్నారు.