Nandamuri Bala krishna: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో సమావేశమైయ్యారు. హైదరాబాద్లోని మంత్రి ఛాంబర్ లో వీరి భేటీ 15 నిమిషాల పాటు జరిగింది. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రి చైర్మన్ హోదాలో బాలకృష్ణ .. హరీష్ రావును కలిసినట్లు భావిస్తున్నారు. ఆసుపత్రిలో మరింత ఎక్కువ మంది రోగులకు సేవలు అందించేందుకు ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగో డే కేర్ యూనిట్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఆసుపత్రిలో ఇప్పటికే మూడు డే కేర్ యూనిట్ లు అందుబాటులో ఉండగా తాజాగా అందుబాటులోకి వచ్చిన సదుపాయంతో డే కేర్ చికిత్సకు 181 పడకలు అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి వర్గాలు తెలిపారు.
ఆరోగ్య శ్రీ కింద సేవలు పొందుతున్న వారికి పడకలు ఇప్పటికే పెంచినట్లు బాలకృష్ణ వెల్లడించారు. బసవతారకం ఆసుపత్రిలోని సదుపాయాలను నీటి ఆయోగ్ పరిశీలించిందనీ, దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా బసవతారకం ఆసుపత్రిని గుర్తించినట్లు బాలకృష్ణ మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ మంత్రి హరీష్ రావుతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.