YS Sharmila Party: వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్నరాజ్యం లక్ష్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఆమె ప్రారంభించారు. అధికార పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తూ వివిధ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే ఇటీవల షర్మిల.. ఏపిలోనూ పార్టీ ప్రారంభిస్తారంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై ఆమెను మీడియా వివరణ కోరగా…ఏపిలో పార్టీ పెట్టే ఆలోచన లేదు అని ఖండించలేదు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు, పెట్టకూడదు అని రూల్ లేదు అని మాత్రం అన్నారు. దీంతో పలు రకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై దుమారం కొనసాగుతుండగా మరో సారి తాను తెలంగాణ ప్రజల కోసమే వైఎస్ఆర్ టీపీ స్థాపించినట్లు వెల్లడించారు. సోదరుడు, ఏపి సీఎం వైఎస్ జగన్ తో షర్మిలకు విభేదాలు వచ్చాయనీ, అందుకే ఏపిలో పార్టీ స్థాపించే ఆలోచన చేస్తున్నారంటూ వైసీపీ వ్యతిరేక మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఈ విషయంపై షర్మిల భర్త బ్రదర్ అనిల్ వినూత్నంగా స్పందించారు. నేడు ఆయన విజయవాడ వచ్చిన సందర్భంలో గన్నవరం విమానాశ్రయం వద్ద పలువురు మీడియా ప్రతినిధులు ఏపిలో షర్మిల పార్టీ అంశంపై ప్రశ్నించగా… షర్మిల పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పార్టీ గురించి తాను మాట్లాడనని పేర్కొన్నారు. విజయవాడకు వ్యక్తిగత పని మీద వచ్చినట్లు చెప్పారు బ్రదర్ అనిల్.