Home వార్తలు ముంబాయి మరణహోమానికి 14 ఏళ్లు ..

ముంబాయి మరణహోమానికి 14 ఏళ్లు ..

2008 నవంబర్ 26న లష్కరే తొయిబాకి చెందిన పది మంది తీవ్ర వాదులు ముంబాయి నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఆ రోజు జరిగిన ఉగ్రదాడికి ప్రపంచం వణికిపోయింది. ఈ మారణహోమం జరిగిన శనివారానికి 14 సంవత్సరాలు పూర్తి కావస్తొంది. ఈ దుర్ఘటనను భారతీయులు ఎవ్వరూ మరచిపోలేరు. ఆ రోజు ఉగ్రమూకలు దేశ వాణిజ్య రాజధానిలో సృష్టించిన మారణహోమం ఇప్పటికీ ప్రజల మదిలో కదలాడుతూనే ఉంది. ముంబాయిలోని చత్రపతి శివాజీ టెర్నినల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహాల్ ప్యాలెస్ హోటల్ పై లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 166 మంది హతమయ్యారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాడు ప్రాణాలు కోల్పోయిన వారిలో కేవలం భారతీయులే కాకుండా మరో 14 దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.

పాకిస్థాన్ లోని కరాచీ రేవు నుండి అరేబియా సముద్రం ద్వారా ముంబాయికి చేరుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఒబెరాయ్ హోటల్, తాజ్, చత్రపతి శివాజీ టెర్నినల్ ల వద్ద నాలుగు రోజుల పాటు దారుణ మారణ హోమం సృష్టించారు. ఈ దాడులకు తెగబడిన ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ పట్టుబడగా, 2012 నవంబర్ 21న భారత్ అతన్ని ఉరి తీసింది. ఉగ్రవాదులను అంతం చేయడానికి దేశ భద్రతా బలగాలు మూడు రోజుల పాటు శ్రమించాయి. ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ లో మహారాష్ట ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే తన ప్రాణాలను పణంగా పెట్టి వీరోచితంగా పోరాడి అశువులు బాశారు. నాటి ఉదంతం యావత్ ప్రపంచాన్ని దిగ్భాంతికి గురి చేసింది. ఈ నాటికీ కూడా హోటల్ తాజ్ లో ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన భారతీయుల కోసం పెద్ద ఎత్తున దేశంలోని ప్రజలు ఘన నివాళులర్పిస్తూనే ఉన్నారు.

కుట్రదారులకు శిక్ష పడాల్సిందే

ముంబాయి పేలుళ్లు జరిగి 14 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జశంకర్ లు ట్విట్టర్ వేదిగా స్పందిస్తూ మృతులకు నివాళులర్పించారు. అమాయక ప్రజలపై పాకిస్థానీ ముష్కరులు బాంబు పేలుళ్లు జరిపి అనేక మందిని పొట్టనపెట్టుకున్నారు. ఆ మారణహోమం తాలూకు భయానక క్షణాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి, కానీ ఆ ఘోరానికి పాల్పడిన వారు మాత్రం శత్రుదేశాల్లో స్వేచ్చగా తిరుగుతూనే ఉన్నారు. వారిని చట్టం ముందు తీసుకొస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. దాడులకు సంబంధించి చిత్రాలతో కూడిన ఓ వీడియోను షేర్ చేశారు మంత్రి జై శంకర్. ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టేంతవరకూ మేం విశ్రమించం అని ప్రధాని నరేంద్ర మోడీ రీసెంట్ గా ఓ వేదికపై మాట్లాడిన సందేశాన్ని వీడియోలో జత చేశారు మంత్రి జైశంకర్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.

Exit mobile version