Gottipati Ravi Kumar: ప్రకాశం జిల్లా కు రావాల్సిన నాగార్జున సాగర్ నీటి వాటా 72 టీఎంసి లను ఈ ఏడాది అయినా కేటాయించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని టీడీపీ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కోరారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను కలిసి నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. అనంతరం గొట్టిపాటి మీడియాతో మాట్లాడుతూ..నాగార్జున సాగర్ లో ప్రస్తుతం నిండుగా నీరు ఉందన్నారు. గతం కంటే ఈ ఏడాది ఎగువన మంచి వర్షాలు కారణంగా సాగర్ లో పూర్తి స్థాయి నీరు చేరడంతో రైతులు సంతోషిస్తూ ఈ ఏడాది మాగాణి, ఆరుతడి రెండు పంటలు వేసుకోవచ్చని ఆశిస్తున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, జిల్లా అంటే లెక్కలేని తనం కారణంగా ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో నీరు ఇవ్వలేమని చెప్తున్నారని, కేవలం ఆరుతడి మాత్రమే నీటిని ఇస్తామని ప్రకటించడం జిల్లాపై ప్రభుత్వ చిన్నచూపే కారణమని విమర్శించారు. మాగాణి,ఆరుతడి పంటల సహా తాగునీటికి కూడా పూర్తిస్థాయిలో నీటిని కేటాయించాలని జిల్లా రైతులు, ప్రజల తరపున కోరుతున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా కరువు, వర్షభావం కారణంగా ఈ ప్రాంత రైతులు అరకొరగానే వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో నీటి నిల్వలు పూర్తి స్థాయిలో లేక కరువు పరిస్థితిలోనూ నీటి సర్దుబాటు చేసి 32 టీఎంసీలు సాగుకి, 6 టీఎంసీలు తాగడానికి ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. ప్రస్తుతం సెప్టెంబర్ 1 నుండి మార్చి వరకు ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని ఇస్తామని చెప్పడం ఏ మాత్రం సమంజసం కాదని గొట్టిపాటి అన్నారు. వెంటనే నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలని అయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరపున ఉద్యమానికి టీడీపీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని అన్నారు.
అలాగే నియోజకవర్గంలో మహిళా పొదుపు సంఘాలలో రాజకీయ జోక్యం పెరిగి పోయిందని ఆరోపించారు. ఉద్దేశ పూర్వకంగా కొన్ని గ్రూపులకు లోన్లు మంజూరు కాకుండా అడ్డుపడటం సమంజసం కాదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా కొత్తగా 11 లక్షల పెన్షన్స్ ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు సరికదా దాదాపు 2 లక్షలకు పైగా పెన్షన్స్ తొలగించారని గొట్టిపాటి విమర్శించారు. ఒక నెల అందుబాటులో లేకపోయినా వారికి ఆ నెల పెన్షన్ లేదని చెప్పడం అత్యంత దుర్మార్గమన్నారు. అలాగే ఒకే కార్డులో రెండు పెన్షన్స్ ఉన్న అనర్హులుగా ప్రకటించడం, సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది తల్లిదండ్రులు కూడా అనర్హులుగా ప్రకటించడం, కరెంటు 300 యూనిట్లు దాటితే పెన్షన్స్ రద్దు చేయడం చాలా దుర్మార్గం అని అన్నారు. తొలగించిన పెన్షన్స్ వెంటనే తిరిగి ఇవ్వాలని అర్హులైన కొత్తవారికి కూడా పెన్షన్స్ ఇవ్వాలని గొట్టిపాటి డిమాండ్ చేశారు.