మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని సీబీఐ తెలిపింది.కాల్ రికార్డులు, గూగుల్ మ్యాప్స్, లావాదేవీలు ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని సీఎం జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్రెడ్డికి సీఎం జగన్ రాజకీయ వారసుడే కాదని విమర్శించారు. సోమవారం బస్సు యాత్రలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడుతూ…వైఎస్ పాలనతో జగన్ పాలనకు పొంతనే లేదన్నారు. భూతద్దం పెట్టి చూసినా ఆ ఆనవాళ్లు కనిపించవని చెప్పారు.
హంతకులకు ఓటు వేయొద్దు..
”వైకాపా పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధరల స్థిరీకరణ అని చెప్పి జగన్ మోసం చేశారు. వైఎస్ఆర్ హయాంలో రైతు రారాజు.. ఇప్పుడు అప్పులేని రైతే లేడు. వైసిపి పాలనలో పంట నష్టం జరిగితే రూపాయి కూడా పరిహారం రావడం లేదు. డ్రిప్ వేసుకోవడానికీ అవకాశం లేకుండా సబ్సిడీలన్నీ ఆపేశారు. సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చారు.. కానీ ప్రభుత్వమే విక్రయిస్తోంది. ఇష్టారీతిన అమ్ముతున్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్లు నిద్రపోయి కేవలం 6వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. జగన్ది హత్యా రాజకీయాలు చేసే పాలన. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్నారు. నిందితుడిగా ఉన్న అవినాష్కే మళ్లీ టికెట్ ఇచ్చారు. అతడు చట్టసభల్లోకి వెళ్లకూడదు. అన్యాయాన్ని ఎదిరించేందుకే ఎంపీగా పోటీచేస్తున్నా. న్యాయం కోసం పోరాటం ఓ వైపు.. హంతకులు మరో వైపు.. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచించాలి. హంతకులకు ఓటు వేయొద్దు అని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ బిడ్డను గెలిపించాలని కోరుతున్నా. ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
షర్మిల ను ఎంపి గా చూడలనేదే వివేక కోరిక : సునీత
ఆడది అంటే నారీ శక్తి అని వివేకా కుమార్తె సునీత అన్నారు. తమను అలాగే పెంచారని చెప్పారు. షర్మిలతో కలిసి బస్సుయాత్రలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ”తప్పు అంటే తప్పు అని చెప్పే మనస్తత్వం మాది. వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు. న్యాయం కోసం పోరాడుతున్నాం. ఆయన్ను చంపి మమ్మల్ని రోడ్ల పాల్జేశారు. షర్మిలను ఎంపీగా చూడాలనేది వివేకా కోరిక. ప్రజలు భారీ మెజారిటీతో ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.