CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ పై నోరు పారేసుకుంటే పోలీసు కేసులు ఎదుర్కోవాల్సిందే. తాజాగా మరో సారి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు అయ్యింది. నల్లజర్లలో జరిగిన ఓ సమావేశంలో అయ్యన్నపాత్రుడు సీఎం వైఎస్ జగన్ పై పరుష పదజాలంతో విమర్శలు చేశారు. దీంతో వైఎస్ఆర్ సీపీ నేత రామకృష్ణ పోలీస్ స్టేషన్ లో అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దూషించిన అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు. రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు అయ్యన్నపాత్రుడిపై ఐపీసీ 153 ఏ, 505 (2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు కావడం ఇదే ప్రధమం కాదు. ఇంతకు ముందు కూడా ఆయన పై జగన్ ను దూషించారని కేసు నమోదు అయ్యింది. బహిరంగ సభల్లో విమర్శలు చేసిన టీడీపీ నాయకులపై పోలీసులు నమోదు చేస్తుండటంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.