Home వార్తలు పౌరసత్వ సవరణ చట్టంపై మౌనం ఎందుకు జగన్ ? : సిపిఎం

పౌరసత్వ సవరణ చట్టంపై మౌనం ఎందుకు జగన్ ? : సిపిఎం

మైనారిటీలను ఉద్ధరిస్తానని రోజు రాగాలు తీసే సిఎం జగన్మోహన్‌ రెడ్డి కేంద్ర బీజీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సిఎఎ పై ఎందుకు మౌనంగా ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో సిఎఎను అమలు చేయబోమని వైసిపి ప్రభుత్వం ప్రకటించాలని, బిజెపి దురాగతాలను ప్రశ్నించకుండా వైసిపి మైనార్టీలను ఎలా రక్షిస్తుందో చెప్పాలనీ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సిఏఏ ద్వారా ముస్లిం మైనార్టీల ఉనికిని దెబ్బతీయటంలో బిజెపిని బలపరచిన తెలుగుదేశం నేరస్థురాలు కాదా? రాష్ట్రంలో మైనార్టీలపై మెజార్టీ మతస్తులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలను సృష్టించాలనుకుంటున్న బిజెపితో కలిసి తెలుగుదేశం లౌకికవాదం ఎలా కాపాడుతుంది అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం, మతం, రంగు, జాతి, ప్రాంతం, భాష ఆధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండకూడదు. కాని సిఎఎ మత ప్రాతిపదికన వివక్ష పాటిస్తుందని విమర్శించారు.19వ అధికరణం ద్వారా మతపరమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇతరులకే పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? శ్రీలంకలో దశాబ్దాలుగా మతపరమైన హింసను ఎదుర్కొంటున్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు.


పొరుగు దేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న ప్రజలను ‘మానవతా దృష్టితో’ ఆదుకునేందుకే ఈ చట్టం తెచ్చినట్టయితే కేవలం మూడు దేశాలకే ఎందుకు పరిమితం చేయాల్సి వచ్చింది? మన పొరుగున ఉన్న మయన్మార్‌లో మైనార్టీలైన రొహింగ్యా ముస్లింలు, హిందువులు శ్రీలంకలో క్రైస్తవ తమిళులు తీవ్రమైన హింసాకాండకు గురయ్యారు. వారిని ఎందుకు ఈ చట్టంలో చేర్చలేదు అంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌ ముస్లింలలో అనేక మైనార్టీ తెగలు తీవ్రమైన హింసాకాండకు గురవుతున్నారు. మరి బిజెపి ప్రభుత్వ ‘మానవతా’ జాబితాలో వారు ఎందుకు చేరలేదు? వీటన్నిటి బట్టి చూస్తే దీని వెనుక ‘మానవత’ లేదనీ, ఒక రాజకీయ వ్యూహంతో ఇదంతా చేస్తున్నదనీ అర్ధమవుతోందని అన్నారు. వామపక్షల మద్దతుతో ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వస్తే సిఎఎ అమల్లోకి రాదని తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు రక్షణగా ఉంటుంది అని పేర్కొన్నారు. మత సామరస్యాన్ని సిపిఎం కాపాడుతుంది అని పేర్కొన్నారు.

Exit mobile version