AP News: ఏపి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్డు మీదకు ఆందోళనలు చేశాయి. మరో పక్క కలెక్టరేట్ల ముట్టడిని అడ్డుకునేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు రాత్రి నుండి అడ్డుకున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. చాలా జిల్లాల్లో నేతలను గృహ నిర్బంధించారు. నోటీసులను పట్టించుకోకుండా వెళ్లే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయినా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఆందోళనలో పాల్గొన్నారు.
నెల్లూరు, ఒంగోలు, విశాఖ, చిత్తూరు, కడప, మచిలీపట్నం, ఏలూరు తదితర జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయుల ఆందోళన కొనసాగుతోంది. నెల్లూరులో పోలీసు వలయాన్ని ఛేదించి ఉపాధ్యాయులు ముందుకు దూసుకువెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ముందస్తు అరెస్టులు చేపట్టి ఉపాధ్యాయులను పోలీసు స్టేషన్ కు తరలించగా వారు అక్కడే నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు జగన్, ప్రధాన కార్యదర్శి మధుసూధన్, కడప జిల్లాలో యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, శ్రీకాకుళంలో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు బాబూరావు ఇలా అన్ని జిల్లాల్లో ముఖ్య నేతలను అరెస్టులు చేశారు. అక్రమ అరెస్టులను నేతలు ఖండించారు.