AP Govt: ఏపి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నా…కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్ ఆధారంగా జీతాల్లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. ఇదే తరుణంలో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల చెల్లింపునకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను సీఎఫ్ఎంఎస్ సిద్ధం చేసింది.
నూతన పీఆర్సీ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఆందోళన ఉదృతం చేశాయి. నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు విధులకు హజరవుతున్నారు. చివరి ఆస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. రేపు (శుక్రవారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మను కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపి జేఏసీ, జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ను ప్రకటించనున్నాయి.